Coronavirus Updates : భారత్ లో కరోనా కేసులు పై WHO ఆందోళన…
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)…కరోనా వైరస్ని తరిమికొట్టగలమనే ఆశలు చిగురిస్తున్నాయని తెలిపింది. ఐతే… కొవిడ్ 19… ప్రపంచ మహమ్మారిగా మారేందుకు ఎక్కువ టైమ్ పట్టలేదన్న విషయాన్ని అన్ని దేశాలూ గుర్తుంచుకోవాలని తెలిపింది. ముఖ్యంగా ఇండియాలో కరోనా కేసులు బాగా పెరిగిపోతుండటంపై WHO తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. గత 7 రోజులుగా… అమెరికా, బ్రెజిల్లో కంటే ఇండియాలోనే రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అంది. సమస్యేంటంటే… ఆ రెండు దేశాల్లో కరోనా తగ్గట్లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇండియా చేరింది. ఫలితంగా ప్రపంచంలో 2 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు ఉంటే… కోటికి పైగా పాజిటివ్ కేసులు… ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. ఈ మాట WHO అనలేదు.
కరోనాను అంతం చేయడానికి రాకెట్ సైన్స్ తరహా విధానం కుదరదని WHO తెలిపింది. కంగారుపడటం ద్వారా కరోనా పోదనీ… ఆ వైరస్ పోవడానికి ప్రజలు, ప్రపంచ దేశాలూ క్రమశిక్షణతో మెలగాలని చెప్పింది. అలా చేస్తే… కచ్చితంగా కరోనా వైరస్ వ్యాప్తిని ఆపగలమని అంది. ఇప్పటికే ఉన్న మందులు, పద్ధతుల ద్వారా కరోనా వైరస్కి అనుకున్నదాని కంటే బాగానే బ్రేక్ వేశామని వివరించింది. మన దగ్గర కచ్చితమైన పవర్ఫుల్ పోలియో వ్యాక్సిన్ ఉంది, కచ్చితమైన ప్రభావవంతమైన మీజిల్స్ (తట్టు) వ్యాక్సిన్ ఉంది. కానీ ఇప్పటికీ మనం ఆ వ్యాధులను పూర్తిగా పోగొట్టేందుకు కష్టపడాల్సి వస్తోందన్న WHO… కరోనాకి సరైన వ్యాక్సిన్ రావడం ద్వారా పూర్తిగా వైరస్ పోతుందని అనుకోలేమని తెలిపింది.